ఇస్లామిక్ క్యాలెండర్(Islamic Calender) ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచించే ముహర్రం(Muharram) నెల 2025 సంవత్సరంలో జూన్ 27, శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే, నెలవంక దర్శనాన్ని బట్టి వివిధ దేశాల్లో ఈ తేదీల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల అయిన ముహర్రంలో పదవ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రత్యేకత:
తెలుగు సంవత్సరం చైత్రమాసం పాడ్యమి నుండి ప్రారంభమై ఫాల్గుణమాస అమావాస్యతో పూర్తవుతుంది. అదేవిధంగా, ఇస్లామిక్ క్యాలెండర్(Islamic Calender) కూడా ఉంది. అయితే, ఇది 365 రోజులకు బదులుగా 354 రోజులు మాత్రమే ఉంటుంది. దీనికి కారణం చంద్రమానం ప్రకారం ఇది లెక్కించబడుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్ సంవత్సర ఆరంభం ముహర్రం నుంచే జరుగుతుంది.
శోకం, త్యాగాల మాసం ముహర్రం:
సాధారణంగా, ముహర్రం(Muharram) నెలలో ముస్లింలు(Muslims) ఎలాంటి మతపరమైన శుభకార్యాలు నిర్వహించరు. ఈ నెల మొత్తం ఇమామ్ హుస్సేన్(Imam Hussian) మరియు ఆయన అనుచరుల కోసం సంతాప దినాలు పాటిస్తారు. ఉపవాసాలు ఉంటారు, ప్రవక్త జీవితం మరియు ఆయన బోధనల గురించి తెలుసుకుంటారు.
కర్బలా యుద్ధం, ఇమామ్ హుస్సేన్ త్యాగం:
మహమ్మద్ ప్రవక్త మరణానంతరం హజరత్ అబూబకర్ సిద్ధీఖ్, హజరత్ అలీ(Hazrat Ali), హజరత్ ఉమర్ మంచి పాలన అందించారు. అయితే, వారి తర్వాత అధికారంలోకి వచ్చిన మావియా చక్రవర్తి ప్రజలను హింసించి ఆనందం పొందేవాడు. అనంతరం యజీద్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకుని క్రూరంగా పరిపాలించాడు. ఆ సమయంలో ప్రజల తరపున హజరత్ హుస్సేన్(Hazrat Hussian) పోరాటం చేశారు. శాంతి కోసం హజరత్ చేసిన ప్రతిపాదనను యజీద్ తిరస్కరించి, యుద్ధాన్ని ప్రకటించాడు.
ముహర్రం నెల మొదటి రోజు ఇరాక్లోని కర్బలా మైదానంలో(Karbala Ground) ఈ యుద్ధం ఆరంభమైంది. యజీద్ సైన్యం హుస్సేన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను, మహిళలను, పసిపిల్లలను సైతం దారుణంగా హతమార్చింది. ముహర్రం నెల ప్రారంభమైనప్పటి నుంచి పదో రోజున అల్లాహ్ను స్మరించుకుంటూ నమాజ్ చేస్తున్న ఇమామ్ హుస్సేన్ను శత్రువులు చుట్టుముట్టారు. ఈ దాడిలో మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన దాదాపు డెబ్భై మంది వరకు అమరులయ్యారు. ఈ సమయంలోనే హజరత్ హుస్సేన్ ఆ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని ప్రార్థిస్తూ శాపం పెట్టి ప్రాణం విడిచారు.
యుద్ధం పూర్తైన తర్వాత యాజిద్ తెగవారు పశ్చాత్తాపం చెంది తమకు మోక్షం ప్రసాదించమని కోరుతూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కణకణమండే నిప్పులపై పాదాలకు చెప్పుల్లేకుండా నడిచారు. ఆ ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కొనసాగుతోంది.
ముహర్రం ఆచారాలు:
మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వారంతా తమ అమరులైన పెద్దలను తలుచుకుంటూ రెండు రోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తారు. ఈ నెల మొత్తం ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.
తెలుగు రాష్ట్రాల్లో పీర్ల పండుగ:
తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) ముహర్రం వేడుకలను పది రోజుల పాటూ జరుపుకుంటారు. పదో రోజును 'ఆషురా(Ashura)' దినంగా పాటిస్తారు. అంతకు ముందు రోజు ఉపవాస దీక్ష చేపడతారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది హిందువులు కూడా ముస్లింలతో కలిసి 'పీర్ల పండుగ'ను జరుపుకుంటారు. 'పీర్(Peer)' అంటే మహాత్ముడు, ధర్మ దేశికుడు అని అర్థం. నిజాం పాలించిన ప్రాంతాల్లోనూ ముహర్రం పండుగను ముస్లింలతో పాటూ అందరూ కలిసి జరుపుకోవడం గమనార్హం. ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది.